“ఎంత భాగస్వామ్యపక్షమైతే మాత్రం, అడిగిందల్లా ఇస్తామా?”- అరుణ్ జైట్లీ
రెండు మూడు రోజుల క్రితం, ప్రత్యేకహోదా గురించి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై పార్లమెంటు సాక్షిగా దేశ ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాధానం! అహంకారపూరితమైన అరుణ్జైట్లీ వ్యాఖ్యలు విన్న తర్వాత ” ఎవడు ఇస్తామని చెప్పాడు బే?”అని అడగాలని అనిపించింది! భాగస్వామ్య పక్షాలకు ఇవ్వరు. వైరి పక్షాలకు ఇవ్వరు. ఏం, భా.జ.పా. ఏలుబడిలోని రాష్ట్రాలకే దోచిపడతారా?
ముందుగా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. పార్లమెంటు తలుపులు మూసి, ప్రసార కార్యక్రమాలు నిలిపివేసి, సరైన చర్చ, ఓటింగు లేకుండానే తెలంగాణా ఏర్పాటయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకు ముందుగా ప్రధానితో జరిగిన సమావేశంలో, విడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి వనరుల లేమి కారణంగా అయిదు సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తికి మద్దతు తెలిపింది భా.జ.పా. ఈ విషయం, మొన్నటి పత్రికా విలేఖరుల సమావేశంలో చంద్రబాబుగారే చెప్పారు!
ఆంధ్ర ప్రజల గురించి మొసలి కన్నీళ్ళు కార్చిన కాంగ్రెస్ తెలంగాణా బిల్లులో ప్రత్యేక ప్రతిపత్తి ఊసే ఎత్తలేదు. అందుకు భా.జ.పా కూడా అప్పటి ప్రధానిని నిలదీసింది. భా.జ.పా., వెంకయ్య నాయుడు ద్వారా అదే పార్లమెంటులో అయిదు కాదు, పది సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తి కావాలని కూడా మన్మోహన్సింగ్ ను డిమాండ్ చేసిన విషయం కూడా రికార్డయిన వాస్తవం. ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తె.దే.పా.తో జతకట్టిన భా.జ.పా., ప్రతి ఎన్నికల సభలోనూ ప్రత్యేక ప్రతిపత్తిపై ప్రజలకు వాగ్దానం చేసిందనేది కూడా వాస్తవం.
అవసరానికి ఆడుకొని, ఆనక అవతల పడేసే పిల్లతనపు బుద్ధులు భా.జ.పా.కు కొత్తకాదు. అంతే కాదు, సూదిలా వచ్చి దబ్బనమయ్యే తేడా వ్యవహారాలూ ఈ పార్టీకి కొత్త కాదు. ఒక మాయావతి, మరో నితీష్, మరో పట్నాయక్, ఇప్పుడు థాక్రే, చంద్రబాబు, త్వరలో బాదల్సు! భా.జ.పా. వ్యవహారంతో బొప్పికట్టించుకున్న బడుద్ధాయిలను చూసి జాగ్రత్త పడింది జయలలిత, మమతలే! ఈ నేతల ఆసరాతో ఆయా రాష్ట్రాలలో బలం పెంచుకోటానికి చూసిన పార్టీ భా.జ.పా. వాపు చూసి బలమని భ్రమ పడటమూ ఆ పార్టీకి అలవాటే. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని తాత్సారం చేసి, 2019లో ఇచ్చి, పొత్తులేవీ లేకుండా ఎన్నికలలో నిలబడితే ఆంధ్ర ప్రజలు భా.జ.పా.ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించరనే విషయాన్ని అమిత్షాలు, అరుణ్జైట్లీలు అర్ధం చేసుకుంటే మంచిది. అన్నిచోట్లా ఆ పప్పులు ఉడకవని ఈ కొత్త రాజులకు తెలిసొచ్చే రోజులకి కాంగ్రెస్ మరోసారి దేశపు కళ్ళాలు చేబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పాపం ఈయన మాత్రం ఏం చేయగలరు. కనీసం మనోళ్ళు మంత్రులైనా అయితే కొద్దో గొప్పో రాష్ట్రానికేదో ఒరిగిస్తామని కేంద్ర ప్రభుత్వంలో చేరారు. ప్రధాని, ఆర్ధిక, రైల్వే మంత్రుల సంగతి తర్వాత, అసలు కేంద్రంలో ఉన్న మన తెలుగుదేశం మంత్రులు రాష్ట్రానికి ఇంతవరకు ఏం చేసారు? గొప్ప పనులు చేసి ఉంటే చెప్పుకోవాలి కదా, మరి ఆ విషయాలేమీ చెప్పరేమిటి? మొన్నటి తీర్మానంపై జరిగిన చర్చలో, ఈ తెలుగుదేశం వీరులంతా మోడీని, వెంకయ్యని పొగడటమే పనిగా పెట్టుకున్నారు కానీ, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం ఆవేశపడలేదు మరి. దీనిపై కూడా బాబుగారు నిప్పులు చెరిగారని వార్తలు. ఎప్పుడు చూసినా మండిపడ్డారనే వార్తలే కానీ, మోడీని ఒప్పిస్తున్న ప్రయత్నాలైతే కనబడటంలేదు. పెళ్ళికి పందిరేయమంటే, చావుకి పాడె కట్టినట్లు; అమరావతి శంఖుస్థాపనకు మోడీని పిలిస్తే, గుప్పెడు మట్టి చెంబెడు నీళ్ళతో సరిపెట్టాడా పెద్దమనిషి! ఇక అడిగేదేముంది బూడిద అనుకున్నారేమో మన ముఖ్యమంత్రి నాలుక తడారిపోయి, మాటలు తడబిడపడి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అడిగారు!! పార్లమెంటులో తమ్ముళ్ళు అడుక్కోలేదని ఇప్పుడు అదిలించటం, బెదిరించటం, ఆవేశపడటం దేనికి?
ఈ ప్యాకేజీ, ఆ పాక్యేజీ, ప్రత్యేక ప్యాకేజీ అన్న కల్లబొల్లి కబుర్లతో కళ్ళకు గంతలు కట్టినా, ప్రజలు అర్ధం చేసుకోలేని అరుణ్జైట్లీలు కాదు. ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఒనగూడేది ఏదీలేనప్పుడు, ఆ ప్రత్యేక ప్రతిపత్తి గురించి పార్లమెంటులోను, బయట ఎందుకు ప్రస్తావించారు? అప్పుడు చెప్పింది మోసమా, ఇప్పుడు చేస్తున్నది మోసమా అనేది భా.జ.పా. నాయకులు తేల్చుకోవాలి. కొత్తగా తెలుస్తున్న తెర వెనుకటి నిజాలతో, విభజన పాపం ఎవరిదనే ప్రశ్న ప్రజలు వేయటంలేదు. ఆ తిలా పాపంలో పిడికెడు పాత్రలు ఎవరెవరు పోషించిందీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తూనే ఉన్నది. ఆ పాపం మొత్తాన్నీ కాంగ్రెస్ పద్దులో వ్రాసేసినా, తిరిగి ఆ కాంగ్రెస్సే నవ్యాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వగలదనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారనేది వాస్తవం. గతి లేనమ్మకు గంజే పానకం అన్నట్లు, కాంగ్రెస్ ముక్త భారత్కు పిలుపునిచ్చిన ఈ అభినవ రాజాధిరాజులకు ముక్తకంఠంతో తోడు నిలిచిన ఈ ప్రజలే, ఆ కాంగ్రెసే దేశానికి అవసరమని భావించే రోజులు కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి.