కాశ్మీర్ – చాలు…ఇక చాలు!

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

 


Original Author: Ravinar, MediaCrooks.com            Telugu Translation: C. Raghothama Rao

Read original article on MediaCrooks.com – Link >> Kashmir – ENOUGH IS ENOUGH


 

రక్తం మరుగుతుంది.

గుండె కోపంతో ఉడుకుతుంది.

ఒక ఉగ్రవాద ఘాతుకం జరిగిన వెంటనే రాజకీయ నాయకులు కూడా ఆవేశంతో ఊగిపోతారు. ఉద్రేకంగా మాట్లాడుతారు. ఆ తర్వతా అంతా సర్దుకుంటుంది.  అంతేగానీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి  వివిధ స్థాయిల్లో ఒక పద్ధతి, ఒక పథకం ఉన్నట్టుగా కనబడదు. ఒకదాని తర్వాత ఒక చర్య తీసుకోవడం జరగదు. నిన్నటి రోజు (14/02/2019) 70 వాహనాల్లో వెళ్తున్న 2,500 సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల పై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి చర్యలో వాడిన IED పేలుడు పదార్థాల బరువు 350 కిలోలు. వీటికి ఒక మీడియమ్ సైజు భవనాన్ని కూల్చివేయగల సామర్థ్యముంది. 2004 తర్వాత మన సైనిక బలగాల పై జరిగిన అతి పెద్ద దాడి ఇది. ఈ వ్యాసం వ్రాస్తున్న సమయానికి దాడికి చెందిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. సుమారు 40 మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ సంఖ్య పెరగవచ్చునన్న వార్తలు కూడా వస్తున్నాయి.  మిగిలిన వాళ్ళలో చాలా మంది గాయపడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, దేహ భాగాలు, ముక్కలైన వాహనాల చిత్రాలను చూస్తుంటే ఇది ఎంత భయంకరమైన దాడినో ఊహించవచ్చు.

 

మనలో చాలామంది ప్రతీకారం కోసం తపిస్తుంటారు. రక్తానికి బదులుగా రక్తం చిందాలని ఆక్రోశిస్తుంటారు. కానీ ఇలాంటి ప్రతిస్పందన సరైనది కాదని తెలుసుకోవాలి. ఇందుకు ఆవేశం లేని ఆలోచన కావాలి. ప్రతీకారం, ఎదురుదాడి – ఈ రెండూ ఒకేవిధంగా ఉండకూడదు. అంతేకాదు, ఇవి రెండూ మనకు వ్యతిరేకంగా చేసిన ఘాతుకాన్ని మించినవి ఉండాలి.

మన జవానులు యుద్ధరంగంలో చనిపోలేదు. సున్నిత ప్రాంతాలను చేరుకోవడానికి వెళ్తూ మరణించారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో పౌర సంచారం (civil & other traffic)ను నియంత్రించడం జరుగుతుంది. అంటే, సైనిక వాహనాలు తప్ప ఏ ఇతర వాహనాలు ఆ దారిలో వెళ్ళలేవన్నమాట. అలాంటిది ఒక ఉగ్రవాది వాహనం సైనిక వాహనాల దగ్గరగా వెళ్ళడమే కాక ఒక వాహనాన్ని ఢీకొట్టి భీభత్సం ఎలా సృష్టించగలిగిందో అంతు చిక్కడమ్ లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు వల్ల త్వరలో వివరాలు వెల్లడి కావొచ్చు.

మూసపద్ధతిలో చేసే ప్రయత్నాల వల్ల కాశ్మీరులో శాంతి స్థిరపడదు. ఇతరులతో చర్చిస్తూ కూర్చోవడానికి ఏమీ మిగల్లేదు. ఎవరినీ ఉపేక్షించకూడదు. ముఖ్యంగా “రాళ్ళు విసిరే” వారిని. కొద్దిమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఈ ’రాళ్ళుగాయి’ల్ని “పాపం పిల్లలు!” అని వెనకేసుకొస్తుంటారు. కానీ తెలుసుకోవల్సిన విషయం ఏమిటంటే ఈ రాళ్ళు విసిరే మూకలే ముందుముందు ఉగ్రవాదులుగా తయారవుతారు. స్థానికుల సహకారం లేకుండా పరాయి ఉగ్రవాదులు మన సైనికులకు సమీపంగా వెళ్ళగలిగేవారు కారు.

గతంలో నేను (MediaCrooks author) వ్రాసిన “Broken Windows” లో ఇలా చెప్పాను – “అమ్మాయిల్ని ఏడిపించేవారిని ఉపేక్షిస్తే రేపిస్టులను, హంతకుల్ని తయారు చేసిన వాళ్ళమవుతాము.” కాశ్మీరులో రాళ్ళు రువ్వే వాళ్ళకు కూడా ఇదే వర్తుస్తుంది. వీరే ఉగ్రవాదులు దూరేందుకు అనుకూలంగా కిటికీలను పగలగొడ్తారు. 2016 లో జరిగిన ఉరి దాడి తర్వాత నేను (MediaCrooks author) ఇలా చెప్పాను: (Read Uri attack )

 

ఇదే కాక ఇంకా ఎంతో చేయాల్సివుంది. ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రెక్ జరిపినా, ఏ కారణం చేతనో ప్రధాని మోడి కఠిన చర్యల్ని తీసుకోలేదు. గతంలో నేను (MediaCrooks author) “Terror support Services” అన్న వ్యాసం వ్రాసిన తర్వాత నరేంద్ర మోడి “టెర్రర్ ఎకోసిస్టమ్” అన్న పేరుతో విమర్శించిన దుష్ట వ్యవస్థ పై చర్యలు తీసుకోవడానికి ఆయన సందేహిస్తున్నాడు.  పాక్ ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు దేశ రాజధాని ఢిల్లీలోను, ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నారు.

 

అయితే, ఇప్పటి దాకా కనీసం ఒక్కడంటే ఒక్క ఉగ్రవాద సహాయకుడి పైన చర్యలు తీసుకోలేదు. చర్యల మాట అటుంచండి. కనీసం వారి పేర్లనైనా బహిరంగంగా చెప్పలేదు. ప్రజలు వాళ్ళని ఈసడించుకొనేలా చేయలేదు. జమ్మూ కాశ్మీరులోని బిజెపి-పిడిపి ప్రభుత్వం కూలిపోయాక భారత ప్రభుత్వం పాత తప్పుల్నే మళ్ళీ చేసింది. కాశ్మీరు సమస్యలో ’భాగస్వాముల’మని చెప్పుకునే వారితో మాట్లాడ్డానికి ఒక ’సంధానకర్త’ను పంపింది. నిజానికి కాశ్మీరు విషయంలో ఉండేది ఒకే ఒక భాగస్వామి మాత్రమే – భారతదేశం . కాశ్మీరులో శాంతికి భంగం కలిగించే వారందరూ దేశద్రోహులు, శత్రువులే.

ఇక “ఉగ్రవాద దాడి పిరికి చర్య” అనే మాటలు. దీనంత వెర్రిబాగులతనం మరొకటి లేదు. ఏ పిరికిపందా 300 కిలోల పేలుడు పదార్థాలను తీసుకువచ్చి తనని తాను పేల్చేసుకోడు. ఉగ్రవాదులు అన్నింటికీ తెగించిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోనివాళ్ళు అసలైన పిరికిపందలు. దేశప్రజలు పిరికిపందలతో విసిగిపోయివున్నారు.

హేయమైన ఉగ్ర దాడి జరిగిన ప్రతిసారి ఇలా ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకోవడమే ప్రభుత్వ విధానంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇలా చెప్పేస్తే అలా మాయాజాలం జరిగిపోయి కాశ్మీరు శాంతియుతంగా మారిపోతుందని కలలు కంటోంది. ఇది జరిగే పని కాదు.

ఇహ ప్రభుత్వం తెచ్చి కూర్చోబెట్టిన గవర్నర్ కూడా వెర్రిబాగుల తత్వానికి ప్రతినిధిలా ఉన్నాడు. “మనం ఉగ్రవాదంతో పోరాడాలి. ఉగ్రవాదులతో కాదు” అన్న అతని మాటల్లో ఏమైనా అర్థం ఉందా? ఈ పిచ్చి ప్రేలాపనకు అర్థమేమిటి?  “మనం అన్నాన్ని కాదు, అన్నం తినడానికి అరిగించుకోవాలి” అని అంటే ఎంత అర్థముందో కాశ్మీరు గవర్నర్ ప్రేలాపనలో కూడా అంతే అర్థముంది. యుద్ధం చేయాలి అంటే శత్రువు ఎవరో స్పష్టంగా తెలిసివుండాలి.  కాశ్మీరులో ఒక్క ఉగ్రవాద మూక మాత్రమే శత్రువు కాదు. ఆ మూకల్ని కని, పెంచి, పెద్ద చేస్తున్న పాకిస్తాన్ అసలైన శత్రువు.  ఈ అవగాహన బుర్రలోకి ఎక్కితే గానీ “ఉగ్రవాదంతో పోరాడాలి” అన్న వెర్రి మాటలకు ఒక అర్థం దొరకదు.

ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకుందాం. ఉగ్రవాదానికి మూలం ఇస్లాం మతోన్మాదం. ఇస్లామీయ ఖలిఫాయత్ ను  ప్రపంచవ్యాప్తంగా నిర్మించే దిశగా సాగుతున్న అంతర్జాతీయ మత యుద్ధం ఈ ఉగ్రవాదం. అయితే, వెర్రి వేయి తలలు వేసినప్పుడు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ కొత్తగా చేయడం జరుగుతుంది.

 

Uri attack వ్యాసంలో చెప్పినట్టుగా కొన్ని చర్యల్ని త్వరగా చేపట్టాలి. ఇవి నేనొక్కడినే (మీడియాక్రూక్స్ రచయిత) చెప్పినవి కావు. ఎంతోమంది దేశభక్తులైన వారు ఇలాంటి సూచనల్ను ఎన్నోసార్లు చేసారు.  ప్రపంచ దేశాలన్నీ చేరి పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుకునే మోడీ సర్కార్ భారత పార్లమెంటులో అటువంటి ప్రతిపాదన చేయదు. ఉరి వ్యాసంలో చేసిన సూచనల్తో బాటు ఈ క్రింది చర్యల్ని కూడా వెంటనే చేపట్టడం మంచిది:

 

  1. పాకిస్తాన్ లోని భారత రాయబారిని వెనక్కు పిలిపించాలి. ఇక్కడి పాక్ రాయబారిని బహిష్కరించాలి.
  2. ఆర్టికల్ 370ని వెంటనే రద్దు చేయాలి. ఇందుకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. దీనిని వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిపై న్యాయపరమైన చర్యల్ని తీసుకోవచ్చు.
  3. పాకిస్తాన్ తో సాగిస్తున్న అన్ని లావాదేవీల్ని వెంటనే ఆపివేయాలి. ఇక్కడున్న పాకిస్తానీయుల్ని తిప్పి పంపించాలి. అక్కడున్న భారతీయుల్ని వెనక్కు తీసుకురావాలి.
  4. శిక్షకు గురైన తీవ్రవాదుల్ని సమర్థించినా, కాశ్మీరు వేర్పాటువాదాన్ని సమర్థించినా అది నేరం అని తీర్మానిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీచేయాలి. ఇందుకు గాను బూజు పట్టిన పాత చట్టాన్ని సరి చేయకుండా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి.
  5. శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో భారత పతాకాన్ని ఎగురవేయాలి. జమ్మూ కాశ్మీరులోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం పై త్రివర్ణ పతాకం ఎగరాలి. పాకిస్తాన్. ISIS  జెండాల్ని ఎగరేవాళ్ళని, ఇతర తీవ్రవాద సంస్థల జెండాల్ను ఎగరేసేవాళ్ళని శిక్షించాలి.
  6. కాశ్మీర్ ప్రాంతంలో సైనిక పాలనను విధించాలి. మన సైన్యం అంగుళం అంగుళం జల్లెడ పట్టాలి.
  7. నలుగురి కంటే ఎక్కువమంది గుంపు కట్టరాదని నిషేధించాలి. ఉల్లఘించినవాళ్ళకు “కనిపిస్తే కాల్చివేత” పద్ధతిని అమలు చేయాలి. శాంతి, సహనం, క్షమ వంటివి ఇప్పుడు పనికిరావు.
  8. కాశ్మీర్ ప్రాంతం నుండి మీడియాను దూరం పెట్టాలి. పనికిమాలిన స్వచ్ఛంద సంస్థల్ని తరిమేయాలి. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని రద్దు చేయాలి. కేవలం లోకల్ కాల్స్ అది కూడా లాండ్ లైన్స్ ద్వారా మాత్రమే అనుమతించాలి. ఎస్టిడి, ఐఎస్‍డి కాల్స్ ను టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ద్వారా మాత్రమే అనుమతించాలి. అన్ని ఫోన్ కాల్స్ ను క్షుణ్ణంగా గమనించాలి. నేరపూరితమైన కాల్స్ చేసినవాళ్ళను వెంటనే అదుపులోకి తీసుకోవాలి.
  9. వేర్పాటువాదులందర్నీ అరెస్ట్ చేయాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు నివ్వరాదు. వీళ్ళు కాశ్మీరులో ఉన్నా, ఇంకెక్కడైనా ఉన్నా వెంటనే అదుపులోకి తీసుకోవాలి. కాశ్మీర్ బయట ఎక్కడైనా బంధించాలి. కాశ్మీర్ వేర్పాటు పై ఇష్టం వచ్చినట్టుగా స్పందించడాన్ని తగ్గించాలి.
  10. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ రాజకీయవేత్త, స్వచ్ఛంద సంస్థ కాశ్మీరులో ప్రవేశించకుండా నిరోధించాలి. ఎందుకంటే కాశ్మీర్ ను ఆరని చిచ్చుగా మార్చాలనే రాజకీయవేత్తలు, సంస్థలు బోలెడున్నాయి.

విషాదకరమైన ఈ ఘటన నేపధ్యంలో నేను ప్రధానిలో గానీ, ప్రభుత్వంలో గానీ లోపాలను వెదికే ప్రయత్నం చేయదల్చుకోలేదు. పులుమావ్ ఘటన పట్ల దేశభక్తుల్లో పెల్లుబుకుతున్న ఆవేశం ప్రధాని నరేంద్ర మోడీలో కూడా ఉంది. ఆయనకు మద్దతుగా మనం నిలబడాల్సిన సందర్భం ఇది. అయితే ప్రధాని కూడా ఎటువంటి కఠిన చర్య తీసుకోవడానికి వెనుకాడకుండా, తచ్చాడకుండా ప్రతిస్పందించాలి. ఇస్లామిక్ తీవ్రవాదుల్లా భారతీయులు రక్తపిపాసులు కారు. ప్రతీకారం, ఎదురుదాడుల మాట తర్వాత. మృతవీరులకు దక్కాల్సిన న్యాయం కూడా సమయానుకూలంగా అందించ వచ్చు. అయితే మొదటగా – కాశ్మీరులో ఇంతవరకూ జరిగింది చాలు. చాలంటే చాలు. బూజు పట్టిన, తుప్పు పట్టిన, మొద్దు బారిన పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిందే. కొత్త వ్యూహాలకు, సరికొత్త ఎత్తుగడులకు ఇది సమయం. భారత దేశ ద్రోహులు ఆశ్చర్యపోయేలా, ఉలిక్కి పడేలా, విలవిల్లాడేలా చేయాల్సిన సమయం వచ్చింది.

Your views are valuable to us!