భృగు సంహిత

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది?
 
అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, కొన్ని పర్యాయాలు అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి. మన దేశంలో ఆదికవి వాల్మీకి “శ్రీమద్రామాయణము”, విష్ణుశర్మ “పంచతంత్రము”, పారిజాతాపహరణము, గుణాఢ్యుని బృహత్కథలు, చాణుక్యుని “నీతి శాస్త్రము” మరియు “అర్ధ శాస్త్రము”, జగన్నాథ పండిత రాయల రచన “గంగాలహరీ స్తోత్రం” ఇత్యాదులు అనేక లేఖనములు, అనేక తాళపత్ర గ్రంథాలు ఉద్భవించినవి. కోవలోదే భృగు మహర్షి రచన “భృగు సంహిత”.
 
భృగు మహర్షి  వైకుంఠమునకు వెళ్ళినప్పుడు, శ్రీమహావిష్ణువు యొక్క నిద్రా నటన హేల, లోకకళ్యాణార్ధము- శ్రీ శ్రీనివాస అవతారమునకు అంకురారర్పణ ఐనది. అవే క్షణాలు భృగు మహర్షి  విశిష్ట గ్రంధమునకు బీజావాపనము చేసినవి. శ్రీమహాలక్ష్మి “నా పతిదేవుని ఉరమున తాడనము చేసితివి” అంటూ ఆ ఋషిపైన కోపించినది. ఉక్రోషముతో లక్ష్మీ-భృగువుల పరస్పర శాపములు ఒక మహత్తర లేఖనమునకు శ్రీకారము చుట్టినవి.

 
ఆమెతో భృగు మహర్షి  “నేను జ్యోతిష్య గ్రంధమును రచిస్తాను” అంటూ ప్రతిజ్ఞ చేసాడు. అలాగ మహర్షి చేసిన భీషణ వాక్కు “భృగు సంహిత” లిఖించే ప్రయత్నంగా పరిణమించినది. మహర్షి భృగు మహర్షి  తన ఆశ్రమమును చేరాడు. అవిరళ తపస్సు చేసి, జ్ఞానార్జనము చేసాడు. తన తపః ఫలితముతో లోకానికి “భృగు సంహిత”ను అందించాడు. భృగు మహర్షి అందులో అనేక అంశాలను ఉటంకించాడు. మానవుల జీవిత చక్రములోని భూత, వర్తమాన, భవిష్యత్ గాథా హేతు విశేషాలను నుడివాడు. పూర్వజన్మ  ఇప్పటి , రాబోయే జన్మల పూర్వా పరములను గురించి, మానవుల “జన్మ కుండలీలు ప్రధాన ఆధారములుగా, వారి జీవితముల విధానముల వివృత చిత్రణములే” భృగు సంహిత.
 
భృగు మహర్షి మొట్టమొదట తన కుమారునికి, తన శిష్యునికీ బోధించాడు. భృగు మహర్షి ఇందలి సిద్ధాంతాలను వారిరువురికీ బోధించాడు. భృగు మహర్షి ఆశ్రమము హొషియార్ పూర్ లో ఉన్నది. అక్కడ ఆయన తాళపత్రములో జ్యోతిష్య విశేషములకు పునాదిరాళ్ళు అనదగిన సిద్ధాంతములను, విశేషములనూ వ్రాసాడు. శిష్యుడైన శుక్రుడు, దశలు దశలుగా ప్రపంచానికి నక్షత్ర గమనములకూ, గ్రహ సంచారములకూ, మనిషి జన్మ తిథి, రాశి పొంతనలకూ గల అవినాభావ సంబంధముల విజ్ఞాన రహస్యాలను అందించాడు.
 
ప్రాచీనభారతదేశములో హొషియార్ పూర్ ఖగోళ విద్యా సంపదకు (astrology)ముఖ్య కేంద్రముగా విరాజిల్లినది. వేలాదిమంది జనులు ఇచ్చటకు తమ తమ మనుగడలో రాబోయే మార్పులు, చేయవలసిన పనులకు అనుసరించవలసిన మార్గాలు, వర్తమాన, భవిష్యత్తుల వివరములను తెలుసుకునే జిజ్ఞాసతో ఇక్కడికి వచ్చేవారు. కానీ తరువాతి దశాబ్దములలో ముష్కరుల దండయాత్రలో, వారి దౌష్ట్యముచే ఈ గ్రంధములోని అనేక భాగాలు లూటీ ఐనవి. ఎన్నో పుటలు ధ్వంసమై, శిధిలమైనాయి.
 
ఆనాటి విద్యావిధానము “కంఠోపాఠము పట్టుట”. లక్షలాది శ్లోకములను, ఉద్ గ్రంధములనూ విద్యార్ధులు ఇసుకలో రాసి, మననము చేసే వాళ్ళు. కాగితములు, పేపర్లు కనిపెట్టని ఆ పురాతన కాలములో గురువులు- చదువు చెప్పే పద్ధతులలో ఋక్కు పట్టుట, కంఠతా పట్టుటయే మేల్తరమైన రీతిగా ఎంచుకున్నారు. ఈ విధానముచే నేటికీ భృగు సంహిత ఆధారముగా ఏర్పడిన జ్యోతిష్య విద్య అందుబాటులో ఉన్నది. జ్యోతిష్య వాక్కును వృత్తిగా అనుసరిస్తూన్న వారు “మేము భృగు మహాముని శిష్య పరంపరకు చెందిన వారసులము” అని చెప్పుకుంటారు.
 
ప్రాచీన, మధ్య యుగములలో ఘూర్జర, ప్రతీహార చక్రవర్తుల పాలనకు, ప్రాచీనతకు ఆలవాలములుగా ఉన్నవి. హొషీయార్ పూర్ ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ సింధు నాగరికతలను ప్రతిబింబిస్తూన్నవి. ప్రాచీన, మధ్య యుగములలో ఘూర్జర, ప్రతీహార చక్రవర్తుల పాలనకు, ప్రాచీనతకు ఆలవాలములుగా ఉన్నవి.

*****

 
Nirmala Mittalనిర్మలా మిట్ఠల్  పూనాలో జన్మించారు. ఆమె జర్నలిస్టుగా, పాత్రికేయ ఉదోగినిగా తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మానవతా విలువలను ఉద్బోధించే సూత్రములు గల హిందూ, బౌద్ధ, ఇస్లాము, క్రైస్తవాది విభిన్న మత సూత్రాలను అర్ధం చేసుకున్న ఆమె, వినూత్నమైన సంగతులను అన్వేషిస్తూ, ఆసక్తికరమైన వృత్తాంతములను చదువరులకు అందించారు. భృగుసంహిత గురించి, ఆమె అనేక పరిశోధనలను చేస్తూన్నారు. ప్రస్తుతం భృగుసంహిత పూర్తిగా దొరకడం లేదు. నిర్మలా మిట్టల్ వద్ద కొద్దిభాగం ఉంది.

One thought on “భృగు సంహిత

Your views are valuable to us!

%d bloggers like this: