అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా?

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

 

 

మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్ట్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ, కానీ ఓడిపోయినా పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి అలెగ్జాండరు అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చివేశాడనీ ఇప్పటికీ మనందరం యెంతో అమాయకంగా నమ్ముతున్నాము!

ఈ అలెగ్జాండరు దండయాత్ర భారతదేశపు చరిత్రలో అతి ముఖ్యమైనదిగా కూడా మన చరిత్రకారులు వర్ణించారు. కానీ భారతదేశంలో కూడా అంతకు ముందే మహాజనపదాలు అన్న పేరుతో 18 విస్తారమైన సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రతి సామ్రాజ్యంలోనూ తమ ప్రభువు యొక్క విజయ పరంపరలని గానం చేస్తూ కావ్యాలు రాయడం జరిగింది. ప్రతి రాజ్యానికీ తన సొంత కరెన్సీ ఉండేది. చరిత్ర రచన శిలా శాసనాల రూపంలో కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం ఇంత ప్రముఖమైనదిగా చదువుకుంటున్న సంఘటన గురించి అసలు యే ప్రస్తావనా లేదు. ఎందుకని?

మన పురాణాలు 18 కావటం కాకతాళీయం కాదు. ఆ పురాణాలాలో ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ లేవు. ఆ పురాణాలలో ఆయా రాజవంశాల చరిత్ర రచించబడింది!

అలెగ్జాండరు పురుషోత్తముల మధ్యన జరిగిన యుధ్ధానికి సంబంధించి మనం చదివిన విషయాలకు ఆధారాలు గ్రీకుల చరిత్రలో కన్నా ఆంగ్లేయులైన ఆధునిక చరిత్రకారుల ఉల్లేఖనాల నుంచే లభిస్తున్నది – కారణం యేమిటి? భారతదేశపు ప్రాచీన చరిత్రలో అలెగ్జాండరుని పురుషోత్తముడు ఓడించాడని చెప్పబడింది. గ్రీకు చరిత్రలో అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి ఓడించాడని చెప్పబడింది. గ్రీసు దేశపు చరిత్రకారులు ఒక గ్రీకు ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాడని రాసుకుంటారా? గ్రీకు ప్రభువు ఇతర్లని జయించాడని రాసుకుంటారా? భారత దేశపు చరిత్రకారులు ఒక భారత ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాడని రాసుకుంటారా? భారత ప్రభువు ఇతర్లని జయించాడని రాసుకుంటారా? బ్రిటిష్ చరిత్రకారులు మాత్రమే ఇతన్ని విశ్వవిజేతగా నిలబెట్టాలని చూశారు. గ్రీకుల వైపు నుంచి అలెగ్జాండరు తప్ప ఇంకెవరూ భారతదేశాన్ని గెలవాలనే ఉద్దేశంలో లేరు. వారి ముఖ్యశత్రువు పర్షియా – దాన్ని గెలిచారు. అందుకే ఇక ముందుకు వెళ్ళడానికి వ్యతిరేకించారు. బ్రిటిషు చరిత్రకారుల కల్పనాత్మకపు విశ్లేషణయే తప్ప అలెగ్జాండరుకి ప్రపంచవిజేత కావాలనే కోరిక ఉన్నదనే గట్టి సాక్ష్యాలు లేవు.

ఆ కాలంలో పురుషోత్తముడి రాజ్యం చాలా చిన్నది. భౌగోళికంగా విదేశీయులు భారతదేశానికి ప్రవేశించే కీలకమైన చోట ఉన్నది అంతే! ఈ పురుషోత్తముడి గురించి ప్రముఖ రాజవంశాల చరిత్రలలో గానీ ఇతర ప్రస్తావనలలో గానీ పేర్కొన లేదు. మహా జనపదాలకి ఉన్న అనేకానేక సామంత రాజ్యాల మాదిరిగానే యేదో ఒక రాజ్యానికి సామంతుడై ఉండవచ్చు. ఈ యుధ్ధం ప్రస్తావనలో మాత్రమే ఇతని పేరు కనబడుతున్నది. మనం చదువుకుంటున్న ఇవ్వాళ్టి చరిత్రకారులు చెప్తున్నట్టు భారతదేశపు చరిత్రలో కల్లా అతి ముఖ్యమైన సంఘటన కూడా కాదు. ఆనాటి వాళ్ళకి ఈ యుధ్ధంలో అలెగ్జాండరు పురుషోత్తముడి చేతిలో ఓడిపోవటమే భారతదేశపు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనబడక పోవటానికి కారణం – అప్రధానమైన విషయాలు చరిత్ర రచనలోకి యెక్కిస్తారా యెవరైనా?

వచ్చాడు, ఓడాడు, వెళ్ళాడు – అంతకన్నా అద్భుతం జరగలేదు!

యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడనేటందుకు తటస్థులు కొందరు ఉదహరించిన చారిత్రక వాస్తవాల కన్నా ముందుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధలోని వైరుధ్యాలని చూపిస్తాను. పురుషోత్తముణ్ణి ఓడించి ఆ రాజ్యాన్ని తనకి ఇవ్వమని అలెగ్జాండరుతో ఒప్పందం కుదుర్చుకున్న తక్షశిల రాజు అంభి మీకు గుర్తున్నాడనుకుంటాను! సహజంగా అలెగ్జాండరుతో విజయయాత్రకి బయలుదేరిన ఇతరులు ప్రాధమిక లక్ష్యమైన పర్షియా మీద గెలుపుతో వెనక్కి తిరగాలని అనుకోవటం వల్ల అలెగ్జాండరు కూడా ఇక వెనక్కి వెళ్ళిపోయే వాడో యేమో గానీ అంభితో ఒప్పందం ఖరారు చేసుకోవడం వల్లనే అతను పురుషోత్తముడి రాజ్యం మీదకి వచ్చాడని స్పష్టంగా తెలుస్తున్నది గదా! మరి, గెలిచాక పురుషోత్తముడు యెంత వీరోచితంగా పోరాడినా అంభితో తను చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసేటంత అమర్యాదకరమైన పని యెందుకు చేస్తాడు? ఇక్కడ ఇంకో హాస్పాదమైన విషయం ఉంది. యుధ్ధం తర్వాత పురుషోత్తముడికి తన సొంత రాజ్యం మాత్రమే దక్కలేదు, అంభి రాజ్యం కూడా కలిసింది – యేమి వింత? గొప్ప పధకం వేసి నది దాటి చుట్టు తిరిగి వచ్చి వెనకనుంచి దాడి చేసి యుధ్ధంలో గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడికి తను ఎవరితోనైతే గెలిచాక పురుషోత్తముడి రాజ్యాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడో ఆ రాజ్యాన్ని కూడా ఓడిపోయిన రాజుకి దఖలు పర్చేశాడట! కామన్ సెన్సుతో ఆలోచించినా సర్వాబద్ధం అని తెల్సిపోయే పిట్టకధని మన పిల్లలకి చరిత్ర పేరున చెప్పడానికి వీటిని పుస్తకాల్లోకి యెక్కించినవాళ్ళకి చదివేవాళ్ళ తెలివితేటల మీద ఎంత చిన్నచూపు వుండాలి? అసలు నిజాలు చెప్పాల్సిన చరిత్రలోకి అబద్ధాల్ని కూరిన చరిత్రకారులకీ వారికి చరిత్రరచన బాధ్యతని అప్పగించిన ప్రభుత్వాధినేతలకీ ఈ దేశప్రజల అజ్ఞానం మీదా అలసత్వం మీదా ఎంత నమ్మకం వుండాలి!

Marshal Gregory Zhukov అనే రష్యన్ యుధ్ధనీతి విశారదుడు ఈ యుధ్ధాన్ని గురించి ప్రస్తావిస్తూ అలెగ్జాండరు నేతృత్వంలో మాసిడోనియన్లు భరతఖండంలో జరిగిన యుధ్ధంలో దారుణంగా పరాజితులయ్యారని ప్రస్తావించాడు! “Following Alexander’s failure to gain a position in India and the defeat of his successor Seleucus Nikator, relationships between the Indians and the Greeks and the Romans later, was mainly through trade and diplomacy. Also the Greeks and other ancient peoples did not see themselves as in any way superior, only different.” – ఇదీ అతను నిష్కర్షగా తేల్చి చెప్పిన విషయం. ఇంకా అనుమానంగా ఉందా?

అలెగ్జాండరు యుధ్ధంలో ఓడిపోతేనే అంభి రాజ్యాన్ని కూడా పురుషోత్తముడికే దఖలు పర్చడం తార్కికంగా సరయినది అవుతుంది. ఆ యుధ్ధంలో తగిలిన గాయాలతోనూ, ఆ ఓటమి వల్ల కలిగిన మనోవ్యధతోనూ మరణించడం జరిగిందనేది యదార్ధంగా తోస్తున్నది! ఎన్ని అబధ్ధాలు? ఎంత కపటం? అంతా వక్రీకరణలూ ,పులుముడు వ్యాఖ్యానాలూ!

ఈ మొత్తం కట్టుకధలో ప్రస్తావించబడిన నలుగురు వ్యక్తుల కాలాలు ఇలా ఉన్నాయి. సాండ్రకోట్టస్ పేరుతో మగధ రాజుని వ్యవహరించారు. మన దేశపు చరిత్రలో చంద్రగుప్తుడనే పేరుతో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు క్రీ.పూ 320లో జీవించి ఉండి భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించినదిగా వర్ణించబడిన గుప్తవంశ స్థాపకుడైన గుప్తవంశపు చక్రవర్తి. మరొకరు క్రీ.పూ320లో మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు. దండయాత్ర జరిగిందని చెప్పబడుతున్న కాలంలో మగధను పాలిస్తున్నది నందవంశం. ఈ ఇద్దరు చంద్రగుప్తులలో యే ఒక్కరికీ ఆ యుధ్ధంతో సంబంధమే లేదు.

అలెగ్జాండరూ, ఇద్దరు చంద్రగుప్తులూ కాకుండా ఆ కధలో వినబడుతున్న మరొక వ్యక్తి సెల్యూకస్ నికటోర్ – అలెగ్జాండరు సైన్యాధిపతులలో ఒకడు. పురుషోత్తముణ్ణి గెలిచిన అలెగ్జాండరు ఇతన్ని తన ప్రతినిధిగా నియమించాడని మన చరిత్ర పేరున చదువుకున్న పిట్టకధలో చెప్తున్నారు. కానీ ఇతను ఇతను అలెగ్జాండరుతో కలిసి వెనక్కి వెళ్ళిపోయి అలెగ్జాండరు తర్వాత బాబిలోనియా రాజ్యాన్ని పరిపాలించి క్రీ.పూ305 నుంచి క్రీ.పూ300 మధ్యన రెండు సంవత్సరాల పాటు అప్పుడు మగధ ప్రభువైన మౌర్య చంద్రగుప్తుడితో పోరాడి ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇచ్చి వివాహం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

ఈ నలుగురికీ సంబంధించి ఇప్పటి చరిత్రలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే విశ్వనాధ సత్యనారాయణ గారు రాసిన పురాణ వైర గ్రంధమాల వరుస కధల్లోని చంద్రగుప్తుని స్వప్నం అనే ఐదవ కధనీ హెలీనా అనే పదవ కధనీ చదివి తీరాలి!

నిజానికి కమ్యునిష్టు పైత్యకారులు విశ్వనాధకి కాలాన్ని వెనక్కి తిప్పాలనుకున్న దురద అంటగట్టినా కొత్త కొత్త సాహితీరూపాలలో తన ప్రతిభ చూపించడంలో మిగతా రచయితల కన్నా చాలా ముందు నడిచాడు. ఆయన వచన రచనలన్నీ సరళ గ్రాంధికంలోనే ఉంటాయి. అయినా పాషాణ పాక ప్రభువని పేరు వచ్చింది. పద్యాలు మాత్రం కొంచెం ముందువెనుకలు సరిచూసుకుని చదివితే తప్ప అర్ధం కావు – పద్యాల్లో Colloquial Tongue వాడాడు మరి!

ఇక కిన్నెరసాని పాటలు యెంత లలితంగా ఉంటాయో చదివితే తెలుస్తుంది. శ్రీశ్రీ కాబోలు తెలుగు సాహిత్యమంతా తగలబడిపోయి ఒక్క విశ్వనాధ సాహిత్యం మాత్రం మిగిలితే చాలు తెలుగువాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అంటే వెటకారంగా అన్నాడేమో అనుకున్నా – కాదు నిజంగా మెచ్చుకోలుగానే చెప్పి ఉంటాడని పురాణవైరగ్రందమాల అన్ని భాగాలూ చదివితే అనిపిస్తుంది! కధ కన్నా పీఠిక శ్రధ్ధగా చదవాలి. శ్రీశ్రీ తన సాహిత్యంలో చాలా చోట్ల విశ్వనాధని ప్రస్తావించినా అక్కడ వెటకారం కన్నా నాకు అంతర్లీనంగా గౌరవంతో కూడిన హాస్యధోరణి ఉందనిపిస్తుంది!

పురాణవైరగ్రంథమాల అంతా మగధ రాజవంశావళి అని చెప్పవచ్చు. రచయిత ఒక్కో కధలో ఒక వంశంలోని చివరి రాజు అంతరించి మరొక వంశంలోని మొదటి రాజు రాజ్యస్థాపన చెయ్యటం వర్ణిస్తాడు. మంచి రాజులూ, చెడ్ద రాజులూ అని గుర్తు పట్టేటంత స్పష్టంగా రాజుల్లో ఉన్న రెండు రకాల్నీ చూపిస్తూ పాత్రలని జీవమున్న వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. భాష సరళ గ్రాంధికంలో ఉండి మామూలు తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ చక్కగా అర్ధమవుతుంది. కధాకధనం విషయాని కొస్తే కళ్ళు చెదిరే సంవిధానం కనబడుతుంది. ఆ రాజులూ సైన్యాధ్యక్షులూ యుద్ధం కోసం ఎలా పథకాలు వేశారు, సైన్యాన్ని ఎలా సమీకరించారు, అవతలి వారి వ్యూహాలని కనిపెట్టి వారికన్నా ముందుగా తాము ఎలా సంసిద్ధమయ్యారు– ఇలాంటివన్నీ మనం ఇపుడు యుద్దాలు చేయడం లేదు కాబట్టి అచ్చంగా అలాగే ఉపయోగించుకోలేక పోవచ్చును, కానీ ఒక అధికారి తన తోటివారితో, క్రిందివారితో, ప్రత్యర్థులతో, తనకి సహాయపడాలని వచ్చే సహృదయులతో, తనని దెబ్బతీయాలని వచ్చే వంచకులతో – ఎవరితో ఎలా మెలగాలో చక్కగా అర్థం చేసుకోగలిగే సన్నివేశాలూ ఉన్నాయి ఈ నవలల్లో.

కొన్ని జీవితానుభవాన్ని రంగరించి చెప్పే అర్ధవంతమైన కొటేషన్లు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాటిలో ఒకటి చెప్పుకుందాం –

ఈ ఆకాశమేమి? ఈ సముద్రమేమి? ఈ దిక్కులేమి? ఈ దేశములేమి? ఈ జనమందరు నిట్లు పుట్టుచుండుట యేమి? ఎవనికి వాడీ సృష్టి నంతయు యేదో తలక్రిందులు చేయుచున్నాననుకొనుట యేమి? వాడు తలక్రిందులు సేయుట యంతయు కలిపి ముప్పది నలుబది ఏండ్లు, కాదా యరువది ఏండ్లు. ఇంకను వీలు మిగిలినచో వంద ఏండ్లు. అంతకంటే మించి లేదు కదా! దాని కొరకు వాని యారాటమెంత? ఈ అనంత కాలములో వందేండ్లే సూక్ష్మాతి సూక్ష్మమైన కాలము. పాతికేండ్లు, పరక ఏండ్లు లోకము నానిపట్టికొని సంతోషించెడి వారి సంగతి నింక నేమి చెప్పవలయును? అందరును లోకమున కుపకారము చేయవలయుననెడి వారే. ఎవ్వడును తాను తరించెడి వాడు లేడు. ఇతరులను తరింప చేయవలయుననెడి వాడే. పెద్దలు లోక మజ్ఞాన దూషితమని చెప్పుదురు. ఆ యజ్ఞానము వేయివిధములుగా నుండవచ్చును. సర్వ విధములైన యజ్ఞానములలో మకుటాయమానమైన యజ్ఞానము పరులను తరింపజేయువలయునన్నది. అది నిజముగా లోకోపకార బుద్ధి కాదు. స్వోపకార బుద్ధి.

ఇలాంటివి చదివినపుడు.. అరే, చిన్నప్పుడే ఈయన రచనలు చదవకుండా ఈ విషయాలన్నీ మనం జీవితంలో బోలెడంత సమయం వృథా చేసి కష్టపడి నేర్చుకున్నాం కదా అని దిగులేస్తుంటుంది నాకు.

వేయిపడగల విశ్వనాధుడు తెలుగువాళ్ళ జ్ఞానపీఠం!

3 thoughts on “అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా?

  1. ముద్రణా దోషమే సార్!మౌర్య సామ్రాజ్యం 321 BCE నాడు మొదలైంది.అలెగ్జాండరు – పురుషోత్తముడి మధ్య జరిగిన యుద్ధం 326 BCE నాడు జరిగింది.అంటే చాణక్యుడి గురుత్వంలో ఆ చంద్రగుపుడు మౌర్య సామ్రాజ్యం స్థాపించడానికి అయిదేళ్ళు ముందర జరిగింది.గుప్త వంసపు చంద్రగుప్తుడి కాల్మ్ 320 CE నాటిది – 600 సంవత్సరాలు తేడా వుంది ఇద్దరు చంద్రగుప్తుల మధ్యన!

    ఈ నలుగురికీ సంబంధించి ఇప్పటి చరిత్రలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే విశ్వనాధ సత్యనారాయణ కూర్చిన పురాణ వైర గ్రంధమాల వరుస కధల్లోని చంద్రగుప్తుని స్వప్నం అనే ఐదవ కధనీ హెలీనా అనే పదవ కధనీ చదివి తీరాలి!ఇప్పుడు లైబ్రరీల్లో, అదీ కొంచెం పాత వాటిల్లో తప్ప ఆ పుస్తకాలు మార్కెట్లో దొరకవు.

  2. హరిబాబు గారు!! వ్యాసం చాలా బాగుంది. అయితే ఒక చిన్న సందేహం. మీ పై వ్యాసంలో ఈ క్రింది పేరాలో
    “మన దేశపు చరిత్రలో చంద్రగుప్తుడనే పేరుతో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు క్రీ.పూ 320లో జీవించి ఉండి భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించినదిగా వర్ణించబడిన గుప్తవంశ స్థాపకుడైన గుప్తవంశపు చక్రవర్తి. మరొకరు క్రీ.పూ320లో మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు……”

    ఇద్దరు చంద్రగుప్తులను క్రీ.పూ 320 అని చెప్పారు. ఇది ముద్రణాదోషమా!? లేక వాస్తవమైతే ఇద్దరూ సమకాలికులా!?.

Your views are valuable to us!

%d bloggers like this: