ఏ కులము నీదంటే…సైని”కులం” నవ్వేను!

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

తేదీ : ఫిబ్రవరి 14, 2019

సమయం: మధ్యాహ్నం 3:15 గం.

స్థలం : పుల్వామా, జమ్మూ కాశ్మీర్

కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన బలగాలతో వెళ్తున్న ఒక బస్‍ను వేగంగా వచ్చిన మహీంద్రా స్కార్పియో వాహనం ఢీకొంది. పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో ఉన్నపళాన పేలిపోయింది. దానితో బాటు CRPF వాహనం కూడా తునాతునకలయింది. అందులోవున్న సైనికుల్లో 44 మంది అక్కడికక్కడ మృతి చెందారు. పాకిస్తాన్ నుండి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మొహమ్మద్ ఈ ఘోరాని పాల్పడిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. మరణించిన సైనికులకు వారి స్వస్థలాల్లో అంత్యక్రియలు జరిగాయి. సైనికాధికారులు, నాయకులతో బాటు దేశప్రజలు ఘననివాళులు అర్పించారు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా విషాదం ఇంకా వీడలేదు. ముక్కలయి పడివున్న సైనికుల శరీరాల తాలూకు జ్ఞాపకాలు మసిబారడం లేదు. రాజకీయపరంగా విడిపోయి, వాదించుకుంటున్న ప్రజలు ఒక్కటయ్యారు. పార్టీల కంటే దేశం, దేశాన్ని కాపాడుతున్న సైన్యం ప్రధానమన్న భావనను వెలిబుచ్చారు. సరిగ్గా అప్పుడే దేశంలోని అంతర్గత శత్రువుల పన్నాగాలు మొదలయ్యాయి.

—————

భారత ప్రజలు ఒకే గొంతుతో “వందే మాతరం”, “జైహింద్” అని నినదిస్తూవుండడం ఈ దేశ పౌరులుగా చెప్పుకునే కొద్దిమందికి ఇష్టం లేదు. ఎందుకంటే వీరు రకరకాల ముసుగులు తొడుక్కుని తమ పబ్బం గడుపుకోవడానికి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికే తహతహలాడేవారు. అందుకనే భారతీయుల ఐక్యతను విడగొట్టడానికి, చెడగొట్టడానికి ఎత్తుగడులు వేస్తున్నారు. అందులోని తొలి అడుగు ’కాశ్మీర్ విద్యార్థులపై దాడులు.’ రెండవది బర్ఖా దత్ మొదలుపెట్టిన ’డిక్ పిక్ గొడవ’. మూడవది  కారవాన్ మాగజైన్ అనే అంతర్జాల వార్తాపత్రిక ప్రచురించిన “మృతవీరుల కులం పట్టీ.”

మీడియాక్రూక్స్ రచయిత రవినార్ ఇప్పటికే బర్ఖా “డిక్ పిక్” ఉదంతంపై వివరంగా వ్రాయడం జరిగింది. ఈ వ్యాసంలోని ప్రధానాంశాలు ఏవంటే:

  • 17/02/2019 బర్ఖా దత్ ఒక ట్వీట్ చేసింది. అందులో దాడులకు గురవుతున్న కాశ్మీర్ విద్యార్థులకు అండగా ఉంటానని, తన ఫోన్ నెంబర్ కు వాళ్ళు ఫోన్ చేయవచ్చని ప్రకటించింది. అంతేగాక తనకు డైరెక్ట్ మెసేజ్ పంపవచ్చని, అదీ చాలకపోతే నేరుగా ఇంటికే రావచ్చని చెప్పింది.

  • 18/02/2019 న బర్ఖా మరొక ట్వీట్ చేసింది. అందులో ఒక వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నట్టు, అసభ్యకరమైన చిత్రాలను వాట్సాప్ లో పంపినట్టు ఆరోపించింది. తనకు వచ్చిన ఆ అసభ్య చిత్రాన్ని ట్వీట్ తో జతపర్చింది కూడా.

ఈ విషయంపై రవినార్ లేవనెత్తిన అభ్యంతరం ఏమిటంటే – “తన ఫోన్ నెంబర్ ను స్వచ్ఛందంగా, సార్వజనికంగా ప్రకటించిన బర్ఖా ఆ తర్వాత తనకు ఫోన్ లో బెదరింపులు వస్తున్నాయని బహిరంగంగా గోల చేయడం ఎందుకు? తనే నెంబర్ ఇచ్చి, వచ్చిన ఫోన్ కాల్స్ పై తనే ఏడవడం దేనికి?” – ఇది సరైన అభ్యంతరమే.

ఇది కాక, రవినార్ అడిగిన మరొక ప్రశ్న – “బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్‍లు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‍కు వెళ్ళి ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి. కానీ బర్ఖా అలా చేయలేదు. బదులుగా పబ్లిక్ మెసేజ్‍లు పెట్టడం, అసభ్య చిత్రాలను అందరికీ చూపిండం వంటివి చేయడం మొదలెట్టింది.” – ఇది కూడా సహేతుకమైన అభ్యంతరమే.

బర్ఖా చేసిన ఆరోపణలపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. వాటి సారాంశం ఏమిటంటే:

  • “తీవ్రవాదులు మన సైనికుల్ని చంపిన ప్రతిసారి శాంతియుతంగా చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవాలని బుద్ధులు చెప్పే నువ్వు ఇప్పుడెందుకు ఇలా నానా యాగీ చేస్తున్నావు? నిన్ను బెదిరిస్తున్న వాళ్ళతో శాంతియుతంగా చర్చించి, సమస్యను పరిష్కరించుకో!”
  • “కాశ్మీర్ లో సైనికులపై రాళ్ళను విసిరే వారిని “పాపం, దారి తప్పిన కుర్రవాళ్ళు!’ అని జాలి పడే నీ జాలి గుండె ఇప్పుడెక్కడపోయింది? ఎందుకు హోమ్ మినిస్టర్ మొదలు పెట్టి సబ్ ఇన్స్‍పెక్టర్ వరకు ట్వీట్లు చేస్తున్నావు?”
  • “ఇది శాంతితోను, సహనంతోను సరిచేసుకోవాల్సిన విషయం. ఇలా గలభా చేయడం వల్ల ఏమీ జరగదు.”

పై స్పందనల్లో తర్కం ఉంది. నిజం కూడా ఉంది. తనకు మాలిన ధర్మాలను చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ తన దాకా వస్తే గానీ నొప్పి తెలీదు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో బర్ఖాదత్ ప్రభుత్వానికి, సైన్యానికి చేసిన హితబోధలు తన దాకా వచ్చేసరికి మాయమైపోయాయి. చివరకు ఆమె పెద్ద ఎత్తున చేయదల్చుకున్న యాగీ అతి తొందరగానే చప్పబడింది. ఎంత చప్పగా అంటే ట్విటర్ సీఈవో సైతం ఆమె చేసిన ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోనంతగా!

ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ చిన్న వ్యాసంలో చెప్పదల్చుకున్న మరొక అంశం ఉంది. అది పై వాటి కంటే ముఖ్యమయింది.

—————

2014లో యథాలాపంగా అంతర్జాల వార్తాపత్రికల్ని తిరగేస్తూవుండగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వార్త నా దృష్టిన పడడం జరిగింది. ఆ పార్టీ పేరు ఎమ్.ఐ.ఎమ్ – మజ్లీస్ ఇ ఇత్తెహదుల్ ముసల్మీన్. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఆల్ ఇండియా ముస్లిమ్ పార్టీ ఇది. ఈ మధ్యనే ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలలో ముస్లిములు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిన పార్టీ. మహారాష్ట్రలో ఒకట్రెండు స్థానాల్ని గెల్చుకున్నా మిగతా చోట్ల అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన పార్టీ.

ఇంతకూ ఆ వార్తలోని ప్రధానాంశం ఏమిటంటే, – “దళిత-బహుజన-ముస్లిమ్ ఐక్యత.”

Buy this eBook on Amazon Kindle
పై చెప్పిన ’ఫార్ములా’ ఆధారంగా మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్.ఐ.ఎమ్. రెండు సీట్లను గెల్చుకుంది. ఆ గెలుపు నేపధ్యంలో “మేము [ఎమ్.ఐ.ఎమ్] దళిత-ముస్లిమ్-బహుజన ఐక్యతను సృష్టించడంలో సఫలమయ్యాం.” అని చెప్పుకొచ్చాడు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. మహరాష్ట్ర ఎన్నికల్లో ఎమ్.ఐ.ఎమ్ వాడిన నినాదం “జై మీమ్ – జై భీమ్.” ఇక్కడ మీమ్ అంటే ముస్లిమ్ అని అర్థం. భీమ్ అంటే ఏమిటో పాఠకులు బాగా తెలుసు. ఇలా “మీమ్-భీమ్” కలయిక వల్ల కొత్త రాజకీయ సమీకరణం ఏర్పడుతుందని, ఆ లెక్కన ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేయొచ్చని అంచనా వేసుకుంది ఎమ్.ఐ.ఎమ్. అయితే మహారాష్ట్ర తర్వాత జరిగిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో “మీమ్-భీమ్” పాచిక పారలేదు.

అయినా సరే, అసదుద్దీన్ ఒవైసీ తన ప్రియమైన “మీమ్-భీమ్” పాచికను అప్పుడప్పుడూ విసురుతూనే వచ్చాడు. 2017లో News18 కు ఇచ్చిన ముఖాముఖిలో డా. అంబేద్కర్ తనకు ఆదర్శమని, ’దళిత-ముస్లిమ్-బహుజన’ ఐక్యతకు ఆయనే కేంద్రబిందువని చెప్పడం జరిగింది. దేశ విభజన నేపధ్యంలో ముస్లిముల గురించి డా. అంబేద్కర్ కొంత వ్యతిరేకతను వ్యక్తం చేసినా వారిని  అతిగా విమర్శించలేదని,  బ్రాహ్మినికల్ పద్ధతుల్ని తీవ్రంగా నిరసించిన ఆయన హిందువుల్లోని దళితులు, బహుజనులు కలిసికట్టుగా ముస్లిములతో జత కట్టగలరు గానీ అగ్రకుల హిందువులతో వాళ్ళు కలవడం జరగదు అని స్పష్టంగా చెప్పారని అన్నాడు ఒవైసీ.

గత సంవత్సరం అక్టోబర్ నెలలో గాంధీ జయంతి రోజున ఔరంగాబాద్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ “దళిత-బహుజనులనే పాలలో చక్కెరలాంటి వారు ముస్లిము”లని ప్రకటించాడు అసదుద్దీన్. ఇదే సభలో డా. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించిన భారిప్ బహుజన్ మహాసంగ్ తో ఎమ్.ఐ.ఎమ్ ఎన్నికల పొత్తును పెట్టుకోనుందని కూడా చెప్పాడు.

ఇలా గత నాలుగైదు సంవత్సరాలుగా అసదుద్దీన్ ఒవైసీ, అతని పార్టీ ’దళిత-బహుజన-ముస్లిమ్’ ఐక్యతను రాజకీయాస్త్రంగా వాడుకోవడానికి ప్రయత్నించడం సాగుతోంది.

—————

ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని జోడించాల్సివుంది.

పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన ఒక వారానికి కారవాన్ మాగజైన్ అన్న అంతర్జాల పత్రికలో అజాజ్ అష్రాఫ్ ఓ వ్యాసం వ్రాసాడు. అందులోని ప్రధానాంశాలు:

  • ’హిందూత్వ’ జాతీయవాదాన్ని మోస్తున్నది పట్టణాల్లో నివసించే అగ్రకులాలు మాత్రమే.
  • ఇందులో దళితులకు ఏమాత్రం చోటు లేదు.
  • పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్లలో అగ్రకుల-దళిత లెక్కలే ఇందుకు సాక్ష్యం.
  • ఈ దాడిలో అగ్రకుల జవాన్ల కంటే నిరుపేద దళిత జవాన్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయారు.
  • మృతవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళెవ్వరూ ఆ తర్వాత పట్టించుకోరు.

పై వాటిల్లో చివరి అంశంలో కొంత నిజముంది. రాజకీయ నాయకుల్లో చాలామందికి అమర జవాన్ల కుటుంబాలను పరామర్శించడం ఒక ప్రచారం మాత్రమే. అయితే, సైన్యం కానీ సి.ఆర్.పి.ఎఫ్ వంటి బలగాలు కానీ మరణించిన తమ సాటివారిని త్వరగా మర్చిపోవు. నియమ నిబంధనల ప్రకారం మరణించిన వారి కుటుంబాలకు దక్కాల్సిన ఆర్థిక సహాయాన్ని గానీ, ఉద్యోగ సహాయం గానీ తప్పక చేస్తాయి. అయితే, పై వాటిల్లో మొదటి నాలుగు విషయాలు పరస్పరం పొంతన లేనివి. భారతదేశ జనాభాలో అగ్రకులాలు అనబడే వారి సంఖ్య నిమ్న కులాలు అనబడే వాటి కంటే ఎప్పుడూ తక్కువే. అజాజ్ అష్రాఫ్ వేసినట్టుగా లెక్కలు వేస్తే, పుల్వామా దాడిలో మరణించిన అగ్రకుల జవాన్ల శాతం మొత్తం జనాభాలోని అగ్రకులాల శాతంకు దగ్గరగా ఉంటుందనడంలో అనుమానం లేదు. కనుక, అష్రాఫ్ వ్యాసంలో నిజాయితీ అన్నది లేదని స్పష్టమవుతోంది.

ఒకవేళ అష్రాఫ్ వాడిన తర్కమే సరైనదైతే, ఆ తర్కాన్ని ఒక్క పుల్వామా ఘటనలోని మృతులతోనే ఆపకూడదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఏయే కులం వారు ఎంతెంత పాత్రను పోషిస్తున్నారో లెక్క కట్టడానికి వాడాలి. అంతేకాదు,  దేశంలో జరిగిన నేరాలలో ఏ కులం వారు ఎన్ని నేరాలను చేసారన్న చిట్టాను తయారు చేయడంలో కూడా వాడాలి. అలా చేసినప్పుడు…చేయగలిగినప్పుడు…అష్రాఫ్ ప్రతిపాదించిన “కుల సమీకరణ” లెక్కకు ఒక అర్థముటుంది. లేదంటే ఆ లెక్కను ఒక తిక్కగానే లెక్కవేయాల్సి ఉంటుంది.

—————

ఒక కొసమెరుపు ఏమిటంటే – పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో దళిత-బహుజన-ముస్లిమ్‍ల సమిష్టి సంఖ్య ఆ దాడిలో చనిపోయిన బ్రాహ్మణికల్ అగ్రకులస్థుల కంటే ఎక్కువ.

చనిపోయినవారిలో 99% హిందువులు. వీరిని ’గోమూత్రం తాగే కాఫిర్లు” అని తిట్టింది బ్రాహ్మణికల్ అగ్రకులాల వారు కాదు – ఒక ముస్లిమ్.

ఆ ’దళిత-బహుజన-ముస్లిమ్’లను చంపింది బ్రాహ్మణికల్ అగ్రకులస్థుడు కాదు – ఒక ముస్లిమ్.

—————

మరి ’హిందూ దళిత-బహుజన’లనే పాలలో ’ముస్లిమ్’లు చక్కెర అన్న మాటల్లోని చేదును గుర్తించాల్సింది ఎవరు?

—————

బహుశా ఆ 49 జవాన్లు జీవించివుండగా “మీ కులం ఏమిటి?” అని అజీజ్ అష్రాఫ్ అడిగివుంటే “సైనికులం” అని చెప్పేవారేమో!

—————

One thought on “ఏ కులము నీదంటే…సైని”కులం” నవ్వేను!

Your views are valuable to us!

%d bloggers like this: